రాజీనామాలు చేయడం వారి ఇష్టం.. మమ్మల్ని అడగడం ఎందుకు?: సజ్జల

  • గతంలో మేము రాజీనామాలు చేసినప్పుడు టీడీపీని అడిగామా?
  • టీడీపీ హయాంలో ఎంత మంది సలహాదారులు ఉండేవారనే లెక్కలు తీస్తున్నాం
  • అమరావతి భూవ్యవహారం పెద్ద స్కామ్
ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం రాజీనామాలు చేసేందుకు తాము సిద్ధమని, వైసీపీ ఎంపీలు సిద్ధమా? అని టీడీపీ ఎంపీలు సవాల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం వారి ఇష్టమని... మమ్మల్ని అడగటం ఎందుకని ప్రశ్నించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేశామని... అప్పుడు టీడీపీ వాళ్లను అడిగామా? అని ప్రశ్నించారు.
 
తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంత మంది ప్రభుత్వ సలహాదారులు, కన్సల్టెంట్లు ఉండేవారనే లెక్కలు తీస్తున్నామని సజ్జల చెప్పారు. ఆ రోజుల్లో కుటుంబరావు, పరకాల ప్రభాకర్ వంటివారు రాజకీయాలు మాట్లాడారని... అప్పుడు అది తప్పుగా అనిపించలేదా? అని ప్రశ్నించారు. అమరావతి భూవ్యవహారం పెద్ద స్కామ్ అని... ఆ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారనే విషయం కూడా అందరికీ తెలుసని చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం ఉపయోగించడం వల్ల సాంకేతికంగా సమస్య ఉత్పన్నమైందని, అందువల్లే సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని అన్నారు. అయితే వాస్తవాలు మరో కోణంలో బయటకు వస్తాయని.. తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని చెప్పారు.

Sajjala Ramakrishna Reddy
YSRCP
Telugudesam

More Telugu News